సిద్దిపేట : చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం నెలకొంది. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఓ రెండు కుటుంబాలు ఇవాళ రంగనాయక సాగర్ రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆ కుటుంబాలకు చెందిన పిల్లలు సరదాగా ఆడుకుంటూ నీళ్లల్లో దిగారు. దీంతో బాలుడు, బాలిక నీటిలో గల్లంతయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. రిజర్వాయర్ వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రిజర్వాయర్లో పడిన బాలుడు మిరాజ్(15), బాలిక అర్బాస్(15)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.