ఆన్లైన్ డెలివరీ బాయ్కు తీవ్ర గాయాలు…
యడ్లపాడు (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా చిలకలూరిపేట-గుంటూరు జాతీయ రహదారిపై గణపవరం, తిమ్మాపురం మధ్యలో గల పరంధామయ్య కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి, ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి, అనంతరం చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఓ ఆన్లైన్ డెలివరీ బాయ్కు తీవ్ర గాయాలయ్యాయి.
స్కూటీ పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. కారు నడుపుతున్న వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే, యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన డెలివరీ బాయ్ను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

