రాజస్థాన్లో అత్తారింటి ముందే దుకాణం
భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసుకు వ్యతిరేకంగా చర్య
గతంలో భార్యాభర్తలు కలిసి తేనెటీగల వ్యాపారం,
మహిళా సాధికారతకు కృషి చేసిన భార్య
న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదంటున్న ధాకడ్
జైపూర్ – రాజస్థాన్లోని (Rajastan ) అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు (Protest ) దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ‘498ఏ టీ కేఫ్’ (498 A Tea Cafe ) పేరుతో ఒక టీ కొట్టును ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ, తనకు జరిగిన అన్యాయాన్ని, న్యాయవ్యవస్థలోని జాప్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
వివరాలలోకి వెళితే . .. ఆ వ్యక్తి పేరు కృష్ణ కుమార్ ధకాడ్ (krishna kumar Dhakad,) .. మధ్యప్రదేశ్ (Madya Pradesh ) లోని నీముచ్ జిల్లాలోని అథానా గ్రామానికి చెందిన కృష్ణకుమార్ గతంలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవాడు.. ప్రిలిమ్స్ (Prelims ) కూడా క్లియర్ చేశాడు.. 2018లో అతడు వివాహం చేసుకున్నాడు.. తర్వాత ఏడాది భార్యతో కలిసి తేనె టీగల పెంపకం ప్రారంభించాడు.. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.. 2021లో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కృష్ణకుమార్ను ప్రశంసించారు.. అయితే 2022లో కృష్ణకుమార్ జీవితం మలుపు తిరిగింది. అతడి భార్య అతడిని వదిలేసింది
కృష్ణకుమార్ భార్య 2022లో అతడితో గొడవపడి విడిపోవడమే కాకుండా అతడిపై కేసులు పెట్టింది. వరకట్న వేధింపుల కేసు, గృహ హింస కేసు పెట్టింది. దీంతో కృష్ణకుమార్కు కష్టాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి అతడు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. చివరకు తన భార్య లాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. చాలా మంది మహిళలు గృహ హింస చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. అత్తారింటి ముందు టీ దుకాణం తెరిచాడు.
ఐపీసీ సెక్షన్ 498A కింద తన భార్య తనపై కేసు పెట్టడంతో అదే పేరును తన టీ దుకాణానికి పెట్టాడు. ఆ టీ స్టాల్లో అతడు చేతికి సంకెళ్లు వేసుకుని టీ తయారు చేస్తాడు. దుకాణం వెలుపల ఉన్న హోర్డింగ్లపై న్యాయం దొరికే వరకు టీ మరుగుతూనే ఉంటుంది అని రాసి ఉంది. తన భార్య చేసిన పని వల్ల తాను మానసికంగా, సామాజికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని, కానీ తన వృద్ధ తల్లి కోసం ఆ ఆలోచనను విరమించుకున్నానని కృష్ణ కుమార్ పేర్కొన్నాడు.
మరోవైపు, కృష్ణ కుమార్ భార్య మీనాక్షి మాలవ్ ఆరోపణలు వేరేలా ఉన్నాయి. “భూమి కొనడానికి అతను మా నాన్నను డబ్బు అడిగాడు. మేము నిరాకరించడంతో నన్ను కొట్టాడు. దాంతో నేను మా నాన్నగారింటికి తిరిగి వచ్చేశాను. నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను. కానీ ముందుగా నా పేరు మీద తీసుకున్న అప్పులన్నీ తీర్చాలి” అని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం కృష్ణ కుమార్ ధాకడ్, అతని ‘498ఏ టీ కేఫ్’ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వినూత్న నిరసన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.