Gold Reserves | ఆర్బీఐలో టన్నుల కొద్దీ బంగారం !!
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతేస్థాయిలో భారతీయ రిజర్వు బ్యాంకు భారీగా పసిడి కొనుగోలు చేస్తూ నిల్వలు పెంచుకుంటూ పోతోంది. బంగారు నిల్వలపై ఇటీవల పార్లమెంట్లో పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తగా, ఆర్బీఐ వద్ద ఉన్న బంగారు నిల్వలతో సహా భారత్లో పెరుగుతున్న బంగారు నిల్వలను ఏ అంతర్జాతీయ కరెన్సీని భర్తీ చేయడానికి ఉద్దేశించబడలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
అయితే, ప్రపంచ మార్కెట్లో సామాన్యులకు అందని స్థాయిలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారంనాడు 10 గ్రాముల పసిడి ధర రూ.87,160కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో ఒడిదొడుకుల నేపథ్యంలో మదుపర్లు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి పుత్తడి ధర పెరుగుతూ పోతోంది తప్పితే తగ్గుదల మాత్రం కనిపించడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారంపై మదుపును సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్ మేరకు బంగారాన్ని అందించేందుకు అనేక దేశాలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. 2024లో పోలాండ్ అత్యధికంగా 90 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.
టర్కీ 75 టన్నులు, భారత్ 73 టన్నులు కొనుగోలు చేసి వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక, భారతీయ రిజర్వు బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ నిల్వలు పెంచుకుంటోంది.
గతేడాది భారతీయ రిజర్వు బ్యాంకు 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. మన పొరుగు దేశం చైనాతో పోలిస్తే ఇది రెండింతలు. అయితే, ఆర్బీఐ పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ, నిల్వ చేస్తుండటం వెనక వ్యూహాత్మక కారణం ఉంది.
అనుకోని సంక్షోభం ఏర్పడినప్పుడు దేశాన్ని బయటపడేసే మోదీ ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోళ్లు జరుపుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం గతేడాది నవంబర్లో ఆర్బీఐ అదనంగా మరో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.