రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విదేశీ బ్యాంకులు
బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ సమావేశం
విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు
విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు
రుణాలు సమీకరించాలని నిర్ణయం
అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. బుధవారం పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేఎఫ్డబ్య్లూ, ఏఎఫ్డీ, ఏడీబీ, ఎన్డీబీచ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు.
తక్కువ వడ్డీకి ఇచ్చే వారితో సంప్రదింపులు
విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్లకు అయ్యే వ్యయంలో రూ.12వేల కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖ మెట్రోకు రూ.6100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి రుణాల ఇచ్చా బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో ఆయా బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోకూడా చర్చిస్తాయి. రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను వేగంగా ముందుకు వెళ్లేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖ మెట్రోకు సంబంధించి..
విశాఖ మెట్రోకు సంబంధించి గత నెల ఆరో తేదీన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రీ బిడ్ నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాగానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకు రావాలని భావిస్తోంది.
విజయవాడ మెట్రోకు..
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి కారిడార్లో 26 కిలోమీటర్లు మేర మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇది పీఎన్బీఎస్ నుంచి గన్నవరం వరకు ఉంటుంది. గత మార్చిలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు 100శాతం నిధులు అందించాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయిలోనూ కేంద్రం ఇచ్చిన నిధులతో కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) తయారు చేస్తున్నారు. సిస్ట్ర ఎంవీఏ సంస్థ సంస్థతో విశాఖలో రూ.84.47 లక్షలతో, విజయవాడలో రూ.81.68 లక్షలతో ప్లాన్ రూపొందిస్తున్నారు. మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది.