(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధితో పాటు ప్రతిష్టను మరింత పెంచే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారి వీకే శీనా నాయక్ తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయ నూతన ఈవోగా శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ వీకే సీనా నాయక్ బాధ్యతలను స్వీకరించారు.
ఈవోగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం మండపంలో వేద పండితులు ఈవో శీనా నాయక్ కు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాన్ని అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈవో కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించి, కుటుంబ సభ్యుల సమక్షంలో తొలి ఫైల్ పై సంతకం చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడిని విఐపి మర్యాదలతో గౌరవించి అమ్మవారి శీగ్ర దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తామన్న ఆయన, నిర్మాణాల విషయంలో ఎక్కడ రాజీ పడబోమన్నారు. గిరిజనుడైన తనకు ఇంతటి అవకాశం, బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముందుండి నడిపించి ప్రోత్సహిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.