India-Pakistan war : నష్టాల్లో కొన‌సాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ముంబై : భారత్-పాకిస్థాన్ ల‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం దలాల్ స్ట్రీట్ పై బలంగా పడింది. దాంతో శుక్రవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా కుంగిపోగా.. నిఫ్టీ 24వేల మైలురాయిని కోల్పోయింది. ఉదయ 11గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 919.49 పాయింట్లు దిగజారి 79,416.32 వద్ద, నిఫ్టీ 295.1 పాయింట్లు పతనమై 23,978.70 వద్ద కొనసాగుతున్నాయి. యుద్ధ భయాలతో మార్కెట్లలో తీవ్ర ఊగిసలాట ఉంది. ఒడిదుడుకులను సూచించే విక్స్ ఇండెక్స్ 22.48 వద్ద కొనసాగుతోంది.

లార్సెన్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జియో ఫైనాన్షియల్, ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలు ఈ రోజు నష్టాల బాటే పట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన భారత సైనిక చర్యను జీర్ణించుకోలేని పాక్.. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. దీంతో ఆ దేశంలో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ యుద్ధ భయాల వేళ నష్టాలు పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *