హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఓ భవన నిర్మాణంలో పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి సంఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలురు అర్జున్ (8) , మణికంఠ (15)గా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతోపాటు వలస వచ్చి ఉప్పల్లోని కుర్మానగర్లో నివాసం ఉంటున్నారు.
చిన్నారుల తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేసుకుంటే జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించక పోవటంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదులో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రాత్రి నుండి గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం భాగాయత్లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్, మణికంఠ మృతదేహాలు లభ్యమైంది.
అనేక కోణాల్లో దర్యాప్తు
ఈ ఘటనపై అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలురు ఆ గుంత దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. స్పష్టత కోసం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల వారి విచారిస్తున్నారు. బాలురును వెతికేందుకు హైడ్రా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ సహకారాలు అందించారు. జీవనోపాధి కోసం వచ్చి ఇలా ఇద్దరు పిల్లలు కోల్పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు చిన్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.