HYD | పెట్టుబడుల పేరుతో రూ.150 కోట్లు స్వాహా..!

హైదరాబాద్‌ నగరంలో మరొక భారీ స్కాం వెలుగు చూసింది. ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ సంస్థ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.150 కోట్ల మేరకు స్వాహా చేశారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్ గణేశ్‌నగర్‌కు చెందిన దంపతులు ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో సిబ్బందిని నియమించుకుని ఏడాది కాలంగా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే బాండ్ల రూపంలో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికారు. కొంతకాలం పాటు కొందరికి లాభాలు సైతం ఇచ్చారు. లాభాలు పొందిన వారు ప్రచారం చేయడంతో వందలాది మంది పెంగ్విన్‌ సంస్థను నమ్మి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు భారీ ఎత్తున పెట్టు బడులు పెట్టారు.

ఈ నేపథ్యంలో సదరు సంస్థ సెక్యూరిటీ బాండ్ల రూపంలో లాభాలు ఇస్తామని చెప్పి దాదాపు 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి రూ.150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అయితే, ఈ సంస్థ ఇటీవల దుకాణం ఎత్తివేయడంతో బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *