హైదరాబాద్ – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి భూముల వివాద నేపధ్యంలో ఆ వర్శిటీ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.. ఆ భూముల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు.. కావాలనే విద్యార్ధులను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు.. ఈ వివాదాల నేపథ్యంలో మంత్రి దుద్దిళ్లతో కలసి నేడు ఆయన మీడియాతో మాట్లాడారు..
అక్కడ భూములలో ఉన్న చెరువులను,జీవ వైవిద్యాన్ని కాపాడతామని అన్నారు.. వర్శిటీ భూములను లాక్కుంటున్నట్లు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.. ఇందులో ఎటువంటి నిజం లేదన్నారు భట్టి.. ఈ భూముల విషయంలో నిజాలు ప్రజలకు తెలియాలనే అన్ని విషయాలు మీడియా ముఖంగా చెబుతున్నామన్నారు.
కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇది వారికి తగదన్నారు..
రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదన్నారు.ఇప్పటివరకూ ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు.. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు..
కానీ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పట్టించుకోలేదు.. ఇప్పుడేమో పని గట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్తో మేం ప్రత్యేకంగా సమావేశమయ్యాము. వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నామని తెలిపారు.
అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అసత్యం. ప్రకృతిని పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు.ప్రజలంతా ఒక్కటీ గమనించాలి. వాస్తవం తెలుసుకోవాలి. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాకా సరిదిద్దాం.. చట్టబద్ధంగానే ముందుకు వెళ్తాం.. తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళనకు గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు.