AP | భవన నిర్మాణాల అనుమతులకు గైడ్ లైన్స్ జారీ !
సెల్ఫ్ సర్టిఫికేషన్ పథకం కింద, భవన నిర్మాణ అనుమతులపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. భవన నిర్మాణ అనుమతులు ఇప్పటి వరకు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు జారీ చేయగా, ఇకపై పట్టణ స్థానిక సంస్థలు మంజూరు చేయనున్నాయి.
ఈ మేరకు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసింది. అయితే సీఆర్డీఏ మినహా రాష్ట్రవ్యాప్తంగా… అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి పట్టణ స్థానిక సంస్థలకు బదలాయిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజాగా విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారం..
- 300 చదరపు మీటర్లకు మించిన భవన నిర్మాణాలకు యజమానులే దరఖాస్తు చేసుకునేలా ఏపీ ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. అలాగే ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
- నివాస భవనాల అనుమతుల కోసం లైసెన్స్ పొందిన టెక్నికల్ పర్సన్లు ఇంటి ప్లాన్ను ధృవీకరించి, ఆన్లైన్లో అప్లోడ్ చేసి అనుమతి పొందేలా అవకాశం ఇచ్చారు. ఈ మేరకు పోర్టల్ ను అప్డేట్ చేశారు.
- ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్లో ఉల్లంఘనలకు పాల్పడే భవన యజమానులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
- కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో నిర్మించే భవనాలకు ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ పథకం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.