బాసర, ఏప్రిల్ 25 (ఆంధ్రప్రభ) : బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన ఇద్దరు మహిళలను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించాడు మోహన్ సింగ్. శుక్రవారం తన విధుల్లో భాగంగా కానిస్టేబుల్ మోహన్ సింగ్ గోదావరి నది నిజామాబాద్ వైపు విధులు నిర్వహిస్తుండగా నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కోస్లికి చెందిన బండారి లక్ష్మి, నవీపేటకు చెందిన సాయమ్మ ఇంట్లో కుటుంబ సమస్యల కారణంగా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ మోహన్ సింగ్ వారికి ధైర్యం చెప్పి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.
ఎస్సై సంజీవ్ ఇరుకుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ఇద్దరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని కుటుంబాలలో వాటిని పరిష్కరించుకోవాలని ఎస్ఐ సూచించారు. ఇద్దరు మహిళలను కాపాడిన మోహన్ సింగ్ ను పోలీసులు, స్థానికులు అభినందించారు.