- చంద్రబాబు హయాంలో విశేష పురోగతి సాధించాం
ఢిల్లీలో NDTV నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో జోష్ ను నింపాయి. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన సమాధానాలిచ్చిన లోకేష్… తన తండ్రి చంద్రబాబు నాయుడి పరిపాలనను సమర్థిస్తూ, రాష్ట్రాభివృద్ధికి ఆయనే తగిన నాయకుడని స్పష్టం చేశారు.
కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి గొప్ప అవకాశమని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం టెక్నాలజీ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు అనుభవం, దూరదృష్టి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమన్నారు. ప్రత్యేకంగా అమరావతి రాజధాని ప్రాజెక్టు, ఐటీ రంగంలో విజయాలు, విదేశీ పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాల్లో చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి ఎంతో లాభం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మందకొడిగా సాగుతోందన్న విమర్శలు వస్తున్న తరుణంలో, చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం రాష్ట్రానికి మేలు చేస్తుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.