సెంటినరీకాలనీలో దారుణం

సెంటినరీకాలనీలో దారుణం
రామగిరి, ఆంధ్రప్రభ : అది సెంటినరీకాలనీ… ఐకేపీ కార్యాలయం సమీపాన.. మీ సేవా నిర్వహకుడు కోట చిరంజీవి (38) పై ముగ్గురు దుండగలు ఇనుపరాడ్, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో చిరంజీవి అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన ఈ రోజు మధ్యాహ్నం జరిగింది.
హత్య జరిగిందిలా…
స్థానికుల కథనం ప్రకారం.. న్యూమారేడుపాక పోతనకాలనీకి చెందిన చిరంజీవి మీసేవ కేంద్రం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన సెంటినరీకాలనీలోని ఐకేపీ కార్యాలయానికి రాగానే అదే సమయంలో ముగ్గురు దుండగులు అతని మీద దాడి చేశారు. అలాగే రాళ్లతో కూడా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతి చెందిన చిరంజీవి భార్య కొంతకాలం క్రితమే మృతి చెందింది. చిరంజీవి మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఇదే హత్యకు దారితీసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు, రామగిరి ఎస్ఐ టీ.శ్రీనివాస్ చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.
