మంగళగిరి ఏప్రిల్ 4 ఆంధ్రప్రభ – మంగళగిరి నియోజక వర్గాన్ని దేశంలోనే ఓ రోల్ మోడల్ గా చేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. పేదల కళ్ళల్లో ఆనందం వెలుగే మా లక్ష్యం అని ఆయన అన్నారు.
మంగళగిరి నియోజకవర్గ ప్రజల 25 సంవత్సరాల కలల సాకారం నిజమైంది. పేదల కళ్ళల్లో ఆనందం వెల్లి విరిసింది. గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేష్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు కుంటున్నారు. దశాబ్దాలుగా ఇల్లు వేసుకుని నివసిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని వేలాదిమంది ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పేదలకు ఇళ్ల పట్టాలు, వస్త్రాలు పంపిణీ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాన్ని మంత్రి నారా లోకేష్ కేవలం 10 నెలలోనే తాను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని లక్షలాది మంది ప్రజలను మన్ననలను పొందారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో గురువారం పేదలకు శాశ్వత పట్టాను అందజేశారు .రెండో రోజు మంగళగిరి మండలంలోని నవులూరు ప్రాంతంలో ప్రజలకు పట్టాలను అందజేసి సహభాష్ అనిపించుకున్నారు. శుక్రవారం నవులూరు డాన్ బోస్కో స్కూలు ప్రాంగణం పక్కన ఉన్న స్థలంలో వేలాది మంది ప్రజలకు శాశ్వత హక్కు పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
1000 కోట్లు విలువైన భూమికి శాశ్వత పట్టాలు..!
బహిరంగ మార్కెట్ లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మొదట బొక్కసం సంధ్య, పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. నేడు మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చివేస్తాయి. 2019 ఎన్నికల్లో నేనొక నిర్ణయం తీసుకున్నా. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నేను తెలుసు కోలేకపోయా. నేనొచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయి. 5,300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధకలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపెంచింది. కష్టపడి మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవాలని ఆనాడు నిర్ణయించు కున్నా. ఏ మెజార్టీతో ఓడిపోయానో దానిపక్కన సున్నా పెట్టుకుని గెలవాలనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసం పనిచేశా.

మంగళగిరి ప్రజల కోసం. 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో మంగళగిరిలో దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ సంజీవని పేరుతో తాడేపల్లి, మంగళగిరితో క్లినిక్ తో పాటు దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాం. ఇప్పటికీ మందులు కూడా అందిస్తున్నాం. నీటి సమస్య ఉంట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ అందించాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. నిరుపేద కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచనతో తోపుడు బండ్లు అందించాం. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కుట్టుమిషన్ శిక్షణ అందించడంతో పాటు వారికి కుట్టుమిషన్లు కూడా అందించడం జరిగింది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్, మందులు సరఫరా చేశాం. అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్ లైన్ లో చికిత్స కూడా అందించాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఈ విధంగా మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం జరిగింది.

91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు..
2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మతిరిగే విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలవడం జరిగింది. అక్కడ పార్టీ జెండాలు, బ్యాక్ డ్రాప్ లు లేవు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చానని లోకేష్ అన్నారు. రెండున్నర దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఆనాడు ప్రజలు నన్ను కోరారు. మూడు విడతలుగా ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పా. సులభంగా చేసే వాటిని ప్రభుత్వ నిర్ణయం మేరకు మొదటి విడతగా అందిస్తాం. ఎండోమెంట్ భూములు, రైల్వే భూముల విషయంలో కొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని కాలువ, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వడం. అందరితో చర్చించేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని, కానీ నేను చేసి తీరతానని ఆనాడు హామీ ఇచ్చా.
కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నాం..

ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలైంది. పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం. ఇంటి కొలతలు తీశాం. అధికారులు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. కొలతలు తీసి వివరాలు కనుక్కున్నారు. తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి తో అనేకసార్లు చర్చించి, ఏకంగా కేబినెట్ కు తీసుకెళ్లి, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ ఒక్కసారి గుండెపై చేయిపెట్టి ఆలోచించాలి. గత రెండున్నర దశాబ్దాల కల ఇది. అనేక మంది నాయకులను మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్ లకే ఎక్కువ ఖర్చు అయింది. అలాంటిది మేం కష్టపడి, మీ దగ్గర బాటిల్ నీళ్లు కూడా తాగకుండా, మీ కోసం కష్టపడి, అవినీతికి తావులేకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మొదటి విడతలో మార్కెట్ లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తోందని నారా లోకేష్ అన్నారు.
నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే.. అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా
నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పా. వంద పడకల ఆసుపత్రి కోసం కేబినెట్ లో అడిగితే ఎవరూ కాదనలేకపోయారు. దానికి కారణం..మీరు నాకిచ్చిన మెజార్టీ. దేవాలయ అభివృద్ధికి నిధులు అడిగేత కాదనలేకపోయారు. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్.. చివరకు భూగర్భ కరెంట్ కూడా మంగళగిరిలో వచ్చే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. దీనికి కారణం మీరు నాకిచ్చిన మెజార్టీ. మీరు నాపైనా భరోసాతో గెలిపించారు. నాపై బాధ్యత పెట్టారు. అహర్నిశలు మీ గురించే ఆలోచిస్తున్నా. మీ తరపున పనిచేస్తున్నా. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి లోకేష్ అన్నారు.
మంగళగిరిని కంచుకోటగా మారుస్తా.
భవిష్యత్తులో మంగళగిరి కంచుకోటగా మారుస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు ఓ వైపు సూపర్ సిక్స్ కార్యక్రమాలతో పాటు మంగళగిరిలో పార్క్ లు, చెరువుల అభివృద్ధితో పాటు కల్యాణ మండపాలు, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, హ్యాండ్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుచేసి నేనిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా నన్నారు. వంద పడకల ఆసుపత్రికి ఏప్రిల్ 13 న శంకుస్థాపన చేసి ఏడాదిలో ఏప్రిల్ 13, 2026న ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంలో మేం అందరం మీ కోసం వచ్చాం, మీకు సేవ చేసేందుకు వచ్చాం, మీకోసం పోరాడేందుకు వచ్చాం. అహర్నిశలు మీ కోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
కుప్పం కంటే.. ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని బాబుకు చెప్పా
ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. సర్వేలో కుప్పం కంటే మంగళగిరి వెనుకబడి ఉంది. ఎంతపని చేశావు.. మంగళగిరి వెనుకబడి ఉందని బాబు చెప్పారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని బాబు కి చెప్పా. అప్పుడు ఎగతాళి చేశారు. కుటంబ సభ్యులం అందరం ఉన్నాం. మీరెప్పుడైతే మెజార్టీ చూపించారో, చంద్రబాబు డిసైడ్ అయిపోయి కష్టపడ్డారని ప్రశంసించారు. మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాలని చెప్పారు. దానికి కారణం మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానం. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ నందం అబద్దయ్య, గుంటూరు టిడిపి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టిటిడి బోర్డు సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి జానకి దేవి టిడిపి నేతలు ఆరుద్ర భూలక్ష్మి, తోట పార్థసారథి, వెంకట్రావు ఇంకా పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్పి మురళీకృష్ణ సిఐలు వై శ్రీనివాసరావు వినోద్ కుమార్ ఎస్సైలు చిరుమామిళ్ల వెంకట్, నాయక్ ఇంకా పెద్ద సంఖ్యలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.