మంగళగిరి – తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి.
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీషీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు.
కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు, కార్లను, సామగ్రిని ధ్వంసం చేశారు. అరగంటకు పైగా పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. అనంతరం వారంతా పరారయ్యారు. ఈ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో.. ఈ కేసును పక్కన పెట్టేశారు. అంతేకాకుండా..టీడీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు.