గుంటూరు కార్పొరేషన్, ఏప్రిల్ 29 ( ఆంధ్రప్రభ ) : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పున: నిర్మాణం కోసం మే 2వ తేదీన విచ్చేయుచున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పర్యటనలో పాల్గొనే ప్రజల పట్ల, అమరావతి ప్రాంతంలో అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పర్యటనలో పాల్గొనే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు,సిబ్బంది తగిన ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా తాగునీటి ఏర్పాటు, మజ్జిగ ప్యాకెట్లు, రవాణా ఏర్పాట్లు, సేద తీర్చుకునేందుకు స్టాల్స్, చలివేంద్రాల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి సుమారు 90,000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంటుందని అంచనా వేయడం జరిగిందని, వారికి ఎటువంటి లోటు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే పర్యటన అనంతరం సభ ముగిశాక ప్రజలు సురక్షితంగా తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేలా ప్రభుత్వం భరోసా కల్పించేలా అధికారులు పనిచేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి తో పాటు గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.