విరిగిపడుతున్న కొండ చరియలు
ఆకస్మిక వరదలతో జనజీవనం అస్తవ్యస్థం
చార్ థామ్ యాత్రకు బ్రేక్
కుప్పకూలిన హోటల్ – శిధిలాల కింద కార్మికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో బార్కోట్ ప్రాంతంలోని సిలై బెండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా సంభవించిన వరదలకు ఓ హోటల్ కుప్పకూలింది. హోటల్లోని 9 మంది కార్మికులు వరదల్లో గల్లంతయ్యారు. మరికొందరు కార్మికులు శిధిలాలలో చిక్కుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
రహదారుల మూసివేత
వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి. చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చార్ ధామ్ యాత్రకు బ్రేక్ ..
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున చార్ధామ్ యాత్రను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. సంబంధిత జిల్లాల పరిపాలన, సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, రోడ్డు మార్గాలను సమీక్షించిన తర్వాత తదుపరి ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఆయన ఇచ్చారు. భక్తులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.

ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్
జూన్ 30, జూలై 1 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తరాఖండ్కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సహయక బృందాలను అలర్ట్ చేసింది.

