- తలతిక్క పనులతోనే కుప్పకూలిన బీఆర్ఎస్ సర్కార్
- ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తా
- ఆదిలాబాద్ రిమ్స్ అధ్వానం
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని, తల తిక్క పనులతోనే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారని, అందుకే కుప్పకూలిపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ఆదర్శ పాలన ఎట్లా అవుతుందనీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాల్లో కూడా కేసీఆర్ (KCR)
ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాం..
ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ (Congress party) అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందనే పూర్తి విశ్వాసం ఉందనీ మంత్రి జూపల్లి అన్నారు. పరిపాలన ద్వారా ఉమ్మడి జిల్లాలో కచ్చితంగా మార్పులు తెస్తామన్నారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే.. వాటిని తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.
తెలంగాణకు బీజేపీ చేసేందేమీ లేదు
తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదని మంత్రి అన్నారు. ఆనాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government) మూడు రాష్ట్రాలను ఇచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, ఈనాడు కూడా నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ.. తెలంగాణకు మొండి చేయి చూపుతున్నారని, తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆంధప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలను చూసి మానవీయ కోణంలో సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కొట్లాడి సాధించుకున్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ధ్వంసం చేసిందని మండిపడ్డారు. అవినీతి, నిర్బంధ, కుటుంబ, అప్రజాస్వామిక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ అధ్వానం
ఆదిలాబాద్ (Adilabad) లోని రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాల లో అపరిశుభ్రతతో రోగులు ఇక్కట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిని సందర్శించి ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, జనరల్ అవుట్ పేషెంట్స్ విభాగాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో అడుగడుగునా అపరిశుభ్రత నెలకొనడం చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రిమ్స్ పారిశుద్ధ్య కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీన్ ను ఆదేశించారు. మంత్రి జూపల్లి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (RIMS Super Specialty Hospital) ని సందర్శించి రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
యాంటీ డ్రగ్స్ పై పోలీసుల 5 కె రన్
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన 5కె రన్ కు విశేష స్పందన లభించింది. డ్రగ్స్ పై ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా యుద్ధం చేయాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి నిర్వహించిన భారీ పరుగు ర్యాలీలో మంత్రి జూపల్లి, ఎంపీ నగేష్, కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎస్పీ కాజల్ సింగ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వేడమ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విట్టల్, రిమ్స్ మెడికోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
