సంగారెడ్డి, మే 5 (ఆంధ్రప్రభ) : బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సీఎస్ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ అందోల్ కు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, కలిసి ప్రయాణించారు.
ఈసందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలంటే, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు. నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తోషిబా కంపెనీ ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.