Gujarat | లోయలో పడ్డ బస్సు – ఐదుగురు దుర్మరణం
గాంధీనగర్ – గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన డాంగ్ జిల్లాలోని సపుతరా హిల్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రయాణికులంతా మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్లోని ద్వారకకు వస్తుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా ఎస్పీ ఎస్జీ పాటిల్ తెలిపారు.
“తెల్లవారుజామున రోడ్డును పూర్తిగా మంచు కప్పేసింది. దీంతో బస్సు అదుపుతప్పి 35 అడుగుల లోతులో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు” అని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.