విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ

విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బాధ్యతల స్వీకరణ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా (ఈఈ) కెవై కొండలరావు సూర్యారావుపేటలోని సర్కిల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఎంఆర్టీ డివిజన్ ఈఈగా విధులు నిర్వర్తిస్తున్న కొండలరావు బదిలీపై విజయవాడ టౌన్ డివిజన్ ఈఈగా బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ ఈఈగా పని చేసిన పీ రవీంద్ర బాబు ఎస్ఈగా పదోన్నతి పొంది కృష్ణాజిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో ఖాళీగా ఉన్న టౌన్ ఈఈ పోస్టులో కొండలరావును నియమించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలువురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈఈలు), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఏఈఈలు), అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ఏడీఈలు) ఇతర అధికారులు కొండలరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కొండలరావు, విజయవాడ నగర పరిధిలో వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి సమన్వయంతో కూడిన కృషి అవసరమని నొక్కి చెప్పారు.
విద్యుత్ మౌలిక సదుపాయాల సమర్థ నిర్వహణతో పాటు ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్వహణ, ఆపరేషన్స్ పనుల సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. నగరంలో సేవల మెరుగుదలతో పాటు విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
