- సర్పంచ్ అభ్యర్థి గౌండ్ల దివ్యవాణి ప్రశాంత్గౌడ్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : తొగర్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గౌండ్ల దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి తాను గెలిచేలా గ్రామస్తులు ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
శనివారం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా, తమ ప్రచారానికి గ్రామస్థులు అనూహ్యంగా సానుకూల స్పందన చూపుతున్నారని తెలిపారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, తాగునీటి సమస్య పరిష్కారానికి నాలుగు బోర్వెల్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గ్రామంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జగ్గారెడ్డి సహకారంతో రూ.1 కోటి విలువైన పనులు పూర్తి చేసినట్లు పేర్కొంటూ, మరో రూ.2 కోట్ల నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని చెప్పారు.
ఎన్నికల్లో విజయం సాధించిన పక్షంలో గ్రామ పరిసర పరిశ్రమల్లో 12 వందల మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ ప్రకటించారు.
తన ప్యానల్లోని 12 మంది వార్డు సభ్యులను ఆశీర్వదించి, సమిష్టిగా మద్దతు ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు.

