కొండమల్లేపల్లిలో పండుగ పూట విషాదం
ఇద్దరు పిల్లలను చంపి తల్లి బలవన్మరణం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27) క్షణికావేశంలో కూతురు అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7) లను ఆదివారం రాత్రి హత్య చేసి ఆపై తానూ బలవన్మరణానికి పాల్పడింది. వీరి కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి కొండమల్లేపల్లిలో నివాసం ఉంటుంది. నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లి పోగా ఆవేశంలో నాగలక్ష్మి తన ఇద్దరు సంతానాన్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి వివరాలను సేకరిస్తున్నారు. భర్త అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.