Earth Hour … గంట పాటు విద్యుత్ వాడ‌కం ఆపాల‌ని చంద్ర‌బాబు పిలుపు

వెల‌గ‌పూడి – అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లని, దాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సహాయం చేయాలని ఏపీ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకూ విద్యుత్ వాడకం ఆపేయాలని చంద్రబాబు సూచించారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్‌ ఉపకరణాలు ఆఫ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది ప్రజలను ఏకం చేస్తోందని, అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని తన ఎక్స్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.

ఈ సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం, అలాగే ఎర్త్ అవర్ రెండూ ఒకే రోజు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మానవ జీవితంలో నీరు, విద్యుత్ శక్తి ఎంతో ముఖ్యమైన మూల స్తంభాలని పేర్కొన్నారు. నీరు, విద్యుత్ శక్తి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ముఖ్యమంత్రి చెప్పారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించడం వల్లే నీటి భద్రత, ఇంధన వ్యయ ఆప్టిమైజేషన్ అంశాలను స్వర్ణ ఆంధ్ర-2047 మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచినట్లు చెప్పుకొచ్చారు. వీటిని పొదుపుగా వాడుకోవడం స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని ఆకాంక్షించారు.

ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని, కానీ సమష్టి కృషి ఎంతో అవసరమని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ప్రతి ఒక్కరూ తమ వంతుగా పని చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని చెప్పుకొచ్చారు. చిన్న చర్యలే రేపటి పెద్దపెద్ద మార్పులకు దారితీస్తాయని, అంతా కలిసి పని చేస్తే ప్రభావవంతమైన మార్పు తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్ పొదుపు విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని పొదుపుగా వాడాలని సీఎం చంద్రబాబు సూచించారు.

https://twitter.com/ncbn/status/1903297487957528744

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *