హైదరాబాద్ : థియేటర్లలో పర్సంటేజీ సమస్యను పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తిని కోరారు. గద్దర్ అవార్డులపై శనివారం ఆయన మాట్లాడుతూ… డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు స్థాయిలో పర్సంటేజీలు కోరిన వారిలో ఒకప్పుడు తాము కూడా ఉన్నామన్నారు. ఎంతోమందిని రిక్వెస్ట్ చేసినా, ధర్నాచేసినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. ఆఖరికి రామానాయుడు తనకు మాటిచ్చారని, ఆ తర్వాత ఆయన కీర్తిశేషులయ్యారన్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటివారిని కూడా పర్సంటేజీపై రిక్వెస్ట్ చేసినా స్పందించలేదన్నారు. దాసరి నారాయణ కూడా చాలా ట్రై చేశారని, పర్సంటేజీలను అమలు చేయడం అనేది పాతికేళ్లుగా ఉన్న సమస్య అన్నారు.
నేడు ఈ సమస్య ఒక కొలిక్కి వస్తున్న దశలో హరిహర వీరమల్లుకు లింక్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇండస్ట్రీ వాళ్లు ప్రభుత్వం ఏర్పడగానే వచ్చి మర్యాదపూర్వకంగా కలవాలని పవన్ అన్నారని, పూర్వకాలంలో రాజుగా ఎన్నికైన వారు ముందుగా ప్రజలను కలిశాకే, రాజు వద్దకు ప్రజలు వెళ్లేవారని, పవన్ కూడా ఇండస్ట్రీ వారిని అలానే కలిసి ఏ సమస్యలున్నాయో అడిగి పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. పర్సంటేజి సిస్టమ్ ను పక్కన పెట్టకుండా దానిపై ఓ నిర్ణయాన్ని తీసుకునేందుకు సహకరించాలని పవన్ కల్యాణ్ ను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. చిన్న నిర్మాతలు, సింగిల్ థియేటర్లు బతకాలంటే పర్సంటేజి సిస్టమ్ ఉండాలని, దానిపై ఆలోచించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేశారు.
పలువురు సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ఇచ్చి.. సినీ పరిశ్రమను గౌరవించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆర్.నారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలోనూ ఈ తరహా అవార్డులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే హరిహర వీరమల్లు సినిమాపై కుట్ర చేశారన్న వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. థియేటర్లు బంద్ చేస్తారన్న వార్తలపై పవన్ ఆఫీస్ ప్రకటన, మంత్రి కందుల దుర్గేష్ మాటలు సరికాదన్నారు. థియేటర్లు బంద్ చేస్తే కనీసం మూడు వారాల ముందే చెప్తారని, థియేటర్లు మూసివేస్తున్నట్లు ఎవరూ అధికారికంగా ప్రకటించలేదనని స్పష్టం చేశారు.