- ఆసీస్ను మట్టికరిపించిన టీమిండియా
కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బౌలర్ల దూకుడు ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు తట్టుకోలేక 119 పరుగులకే ఆలౌటయ్యారు. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసీస్ జట్టు పూర్తిగా విఫలమైంది.
ఫలితంగా భారత్ 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వాషింగ్టన్ సుందర్ (3/3), శివమ్ దూబే (2/20), అక్షర్ పటేల్ (2/20), వరుణ్ చక్రవర్తి (1/26), జస్ప్రీత్ బుమ్రా (1/27), అర్ష్దీప్ సింగ్ (1/22) అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను చీల్చిచెదరగొట్టారు. 5వ ఓవర్ నుంచే భారత బౌలర్లు ఊచకోత మొదలుపెట్టి 19వ ఓవర్లోనే మ్యాచ్ను ముగించారు. ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) మినహా ఎవరూ చెప్పుకోతగ్గ ప్రదర్శన కనబరచలేకపోయారు…
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ (28), శుభ్మన్ గిల్ (46) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం శివమ్ దూబే (22), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (20) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (12), అక్షర్ పటేల్ (21 నాటౌట్) విలువైన పరుగులు జోడించి జట్టును పోటీ స్థాయికి చేర్చారు.

