పంచ కోశాలు… పరబ్రహ్మతత్వం

వరుణ మహర్షి కుమారుడు భృగు మహర్షి తన ఆశ్రమ విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత , తండ్రి వద్దకు వచ్చి ”నాన్నగారు! నాకు పరబ్రహ్మ తత్త్వము తెలుసుకోవాలని ఉంది. అది ఎలా తెలుసుకోవాలో విశదపరచండి! అని కోరాడు. అపుడు వరుణ మహర్షి బదులిస్తూ ”నాయనా! కుమారా! మానవ శరీరం మూడు భాగాలుగా ఉంది కదా! అవే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. స్థూల శరీరమే బాహ్యంగా కనపడుతోంది. మనసు, ఆత్మ వంటి అంతర్‌ చక్షువులు, ఇంద్రియాలు, పంచ ప్రాణాలు
వంటి వాటితో కూడినదే సూక్ష్మ శరీరం. ఇంకా సుషుప్తావస్తలో నీకు తెలియకుండా కొన్ని పనులు జరుగు
తున్నాయి.అవయవాలు అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి.
మన శరీరంలో పంచ కోశాలు ఉన్నాయి. అవే 1)అన్నమయ కోశము 2)ప్రాణామయ కోశం 3)మనోమయ కోశము 4) విజ్ఞానమయ కోశము 5) ఆనందమయ కోశము. వీటి గురించి నువ్వు తెలుసుకోవాలంటే తపస్సు చేయమని సూచించారు. అప్పుడు భృగు మహర్షి దీక్షగా కొంతకాలం తపస్సు చేసాడు. అప్పుడు అన్నం తో ఉత్పత్తి అయిన ఈ శరీరం, అంటే బాహ్యమైన శరీరం అన్నమయ కోశము అని, అన్నం (ఆహారం) ప్రకృతి నుండే లభిస్తోంది. అన్నం లేకపోతే జీవుడు బ్రతికి ఉండడు నశిస్తాడు అని తెలుసుకొని, తండ్రికి తెలిపాడు. తండ్రి ”కుమారా! అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే పారవేయకూడదు నువ్వు తపస్సు ద్వారా కొంచెం తెలుసుకొన్నావు కాబట్టి అన్నము, ప్రాణం, మనసు, ఇంద్రియాలు, వాక్కు మొదలైనవి పరబ్రహ్మ సాధనకు మార్గాలే. అందుచేత నువ్వు మళ్ళీ తపస్సు చేయి” అని ఆజ్ఞాపించాడు. భృగుమహర్షి మరికొంత కాలం ఘోరమైన తపస్సు చేసి పరబ్రహ్మ తత్వం కనుగొన్నాడు.
పైకి బాహ్యంగా గోచరించే శరీరం అన్నము (ఆహారం) మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే అన్నమయ కోశము అన్నారు. కోశము అంటే తొడుగు, కప్పు లాంటిది. ఉదాహరణకు వడ్ల గింజలో బియ్యపు గింజ ఉన్న విధంగా. అన్నము తినడానికే జీవించ కూడదు. జీవించడానికి మాత్రమే అన్నము తీసుకుని, ప్రాణాలను నిలబెట్టుకోవాలి. అన్నమును ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఇక ”ప్రాణం” లేకపోతే, జీవి ఉండడు. ప్రాణానికి ఆధారం అన్నం. ఈ ప్రాణం శరీరం లోపల ఉంటుంది. దీనినే ప్రాణామయ కోశం అని అంటారు. ప్రొణామయ కోశం మనోమయ కోశమును కప్పి ఉంచుతుంది. మనోమయ ఆధారం (అంటే) మనస్సు. మనం చేసే ఆలోచనలు, కర్మలు మనోమయ కోశము లోని మనస్సే మూలకారణం. ఇంకా మనోమయకోశం విజ్ఞాన మయ కోశమును కప్పి ఉంటుంది. విజ్ఞాన మయ కోశములో బుద్ధి ఉంటుంది. మనసును నియంత్రణ చేసే పద్ధతి గురించి, జీవులు చేసే కర్మలను చూసి హెచ్చరిస్తుంది. ఆనందమయ కోశమును విజ్ఞానమయ కోశము కప్పి ఉంటుంది. అందుకే జీవుడు చింతనతోనే ఉంటాడు. ఆపైన ఆనందమయ కోశము అంటారు.
పైన వరుణ మహర్షి చెప్పిన రీతిలో మనసు, ప్రాణం, బుద్ధి కర్మేంద్రియాలు వంటివి అన్నీ శరీరంలోని లోపలి భాగాలు. అందుకే అంతర్‌ చక్షువులు అంటారు. వాటికి స్వతహాగా కళ్ళు లేకపోయినా, మనల్ని ఆజ్ఞాపిస్తూ, నియంత్రణ చేస్తూ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకుని వెడుతూంటాయి. ఆనందమయ కోశం స్వతంత్రంగా ఏ పని చేయలేదు. మనసు ప్రేరేపితమైతే వాక్కు పుడుతుంది.
మనం అన్నమయ కోశము నుండి ఆనందమయ కోశం వరకు తిరుగూతూనే ఉంటాము. అన్నమయ కోశము నుండి ప్రాణాలను కాపాడుకొంటూ, (ప్రాణమయ కోశం) మనసుతో ఆలోచించి (మనోమయ కోశము), మన ఆలోచనలు సక్రమమా? కాదా? అని విజ్ఞానమయ కోశము(బుద్ధి)ను ఆధారంగా జ్ఞానంతో అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడుస్తూ (ఆనందమయ కోశం) ఉండడం వల్ల, జీవుల్లో నిస్వార్థంగా, ధర్మాచరణ చేస్తూ ఆత్మజ్ఞానం పొందగలగడమే పరబ్ర#హ్మ తత్వం. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం.

  • అనంతాత్మకుల రంగారావు

Leave a Reply