ఎండిపోతున్న పంట పొలాలు
కమీషన్లపైనే కాంగ్రెస్ దృష్టి
ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఆంధ్రప్రభః ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్ధ, దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతలతో సాగు నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని గుర్తు చేశారు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలలో సాగు..తాగునీటీ సమస్యల కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాలలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని అన్నారు. విద్యుత్ సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్ ప్లాంటు ఏర్పాటు చేశారని తెలిపారు.
కమీషన్లపైనే దృష్టి..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగునీటిని కూడా అందించలేని అసమర్థతలో పడిపోయిందని..కేవలం వారు కమీషన్లపై దృష్టి కేంద్రీకరించారని కవిత విమర్శించారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ ఈ ప్రాంతాలకు సాగు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క సారాలమ్మ 95శాతం పూర్తి చేయగా..అసంపూర్తి 5శాతం పనులను కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.