TG | కాళేశ్వరం కమిషన్ కు క్యాబినెట్ మినిట్స్ – మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: : రాష్ట్రంలో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ సమావేశమైన రేవంత్ మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. నాలుగు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ కు క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వారంలో కమిషన్ కు సమాచారం ఇవ్వనుంది ప్రభుత్వం .

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..

మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ నెల 16 న సీఎం రేవంత్ చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అమలు చేశామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రుణమాఫీ రేపటితో అమలు చేస్తున్నట్లు వెల్లడిచారు. ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. రేపు రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. రైతులతో విజయోత్సవ సభ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పండుగలా నిర్వహిస్తామన్నారు.

అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. నవంబర్ 9 వరకు ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు.

సంగారెడ్డి-చౌటుప్పల్ వరకు RRR కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. గోబెల్స్ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బనకచర్లపై తెలంగాణ వాటాలో ఉన్న ఒక్క చుక్కను కూడా వదులుకోమని, ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బనకచర్లకు గత ప్రభుత్వంలో పునాది వేశారని, వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.

జూలై మొదటి వారంలో బనకచర్లపై ప్రజాప్రతినిధులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తామన్నారు. బనకచర్లపై హైలెవల్ అధికారుల కమిటీ చర్చ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమాచారాన్ని కమిషన్ కు అందిస్తామన్నారు.నాటి కేబినెట్ తో పాటు, సబ్ కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నెల 30వ తేదీ వరకు కమిషన్ కు వివరాలు అందిస్తామన్నారు.

స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 2047 రైజింగ్ తెలంగాణ విజన్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. ప్రతి నెలకు రెండు సార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.

మంత్రివర్గ నిర్ణయాలు==>

అన్ని కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాలు (కొత్త నమూనా) పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం.

==> కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా.. లేదా అనే అంశంతో పాటు పూర్తి వివరాలను ఈ నెల 30వ తేదీలోగా కమిషన్‌కు అందివ్వాలని నిర్ణయం.

==> అన్ని శాఖల పెండింగ్ బిల్లులపై హాట్‌హాట్‌గా చర్చ కొనసాగింది.

==> కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం తీసుకువస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు కొత్త క్రీడా విధానం తీసుకువచ్చింది.

==> రీజనల్‌ రింగ్‌ రోడ్డు సదరన్‌ పార్ట్‌ అలైన్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం

==> హుజురాబాద్‌లోని న్యాయ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయం.

==> రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో ప్రతి మండల కేంద్రంలో సంబరాలు చేయాలని మంత్రివర్గం ఆమోదం. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా రైతునేస్తం సభ చేపట్టాలని నిర్ణయం

.==> పీసీ ఘోస్‌ కమిషన్‌ రాసిన లేఖకు ఈనెల 30వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం.

Leave a Reply