హైదరాబాద్ – రోడ్లు వేయలేదని తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలోనే 200 కోట్లకు పైచిలుకు నిధులతో రోడ్లు వేసినట్లు చెప్పారు. ఉప్పల్ ఫ్లైఓవర్ కేంద్రం పరిధిలో ఉందని, అప్పుడు పనులు కాలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటిందని, ఏమైనా పనులు జరిగాయా? అని ప్రశ్నించారు. తన క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండని అన్నారు.
పదేళ్లలో ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్లు వేశాం…
పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో డబుల్ రోడ్లు 8000 కిలోమీటర్లు వేశామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశామన్నారు. 17వేల కిలో మీటర్లకు రూ.23వేల కోట్లు ఖర్చు అవుతాయని, అయితే మొత్తం ఖర్చులో 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారని ప్రశ్నించారు. . ఇప్పటికీ ఏడాదిన్నర కాలం పూర్తయిందని, మూడున్నర సంవత్సరాలలో 17 వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు? అని ప్రశ్నించారు.