కడప – తెలుగుదేశం జెండా.. తెలుగు జాతికి అండ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై మంత్రి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల ప్రగతి కోసం టీడీపీ కృషి చేస్తుందన్నారు. పౌరుషాల గడ్డ కడపలో పసుపు జెండా సత్తా చూపించేందుకు తెలుగు దండు కదం తొక్కిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక మహానాడు ఈసారి కడపలో ఘనంగా జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత నారా లోకేష్ అని వెల్లడించారు.
పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలతో జగన్ అండ్ కో టీమ్ ప్రజా సంపద దోచుకుందని ఆరోపించారు. వస్తున్నా మీ కోసం అని నాడు చంద్రబాబు భరోసా ఇచ్చారని.. యువగళం పేరుతో తెలుగు ప్రజలకు నారా లోకేష్ అండగా నిలిచారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.