Tangirala Soumya | స్వచ్ఛతతోనే సమగ్ర అభివృద్ధి…

Tangirala Soumya | స్వచ్ఛతతోనే సమగ్ర అభివృద్ధి…
- విప్ తంగిరాల సౌమ్య..
Tangirala Soumya | నందిగామ, ఆంధ్రప్రభ : స్వచ్ఛతతోనే సమగ్ర గ్రామ అభివృద్ధి సాధ్యమని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ రోజు కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛ రథాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… పరిశుభ్రత అనేది అభివృద్ధికి మూలమని, స్వచ్ఛత ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఇంటి నుంచి మొదలై వీధి, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం వరకు పరిశుభ్రతను పాటించినప్పుడే దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చనే అవగాహన ప్రజల్లో కల్పించడమే స్వచ్ఛ రథం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తూ స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామిగా మారి తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత అవగాహన ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

