నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 25 (ఆంధ్రప్రభ) : ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తద్వారా రోగాలు దరి చేరవని డీఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలోని స్థానిక దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దుబ్బ ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై, మనందరి పంతం.. దోమల అంతం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, నీటి నిల్వలను తొలగించండి, మన ఆరోగ్యం మన చేతుల్లో, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమతెరలను వాడండి అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అనంతరం దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎంహెచ్ ఓ మాట్లాడుతూ… దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులను అరికట్టాలని సూచించారు. ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతిరోజు గృహ సందర్శనలో ఏ రకమైన జ్వరం అయినా రక్త నమునాలు సేకరించి, మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని తెలియజేశారు. అదేవిధంగా ఫీవర్ సర్వేను నిర్వహిస్తూ ప్రతి శుక్రవారం నీటి నిల్వలను తొలగించు టకై ఫ్రైడే, డ్రైడే ని నిర్వహించాలని డీఎంహెచ్ ఓ సూచించారు.
జిల్లా కీటక జనీత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ… జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఒక్క మలేరియా కేసు నమోదు కాలేదని, మలేరియా నిర్మూలనకై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క మలేరియా కేసు నమోదు కాని మూడు జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణీలు డా. శ్రీలత, డా. సుసేన, డా.శిఖరా, డా.చంద్రకళ, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా అధికారి మహమ్మద్ సలీం, సబ్ యూనిట్ అధికారి గోవర్ధన్, హెచ్ఇఓ లు నటరాజ్, సంతోష్, లింగారెడ్డి, నాగరాజు, ఆరోగ్య పర్యవేక్షకులు శాంతాకు మారి, స్వామి, మధు సూదన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.