ఆంధ్రప్రభ, గోరంట్ల ( శ్రీసత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఓ వస్త్ర దుకాణం దగ్ధమైంది. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి ప్రధాన రహదారిలోని పోలీస్ స్టేషన్ కు ఎదుట భారీ రేకుల షెడ్డులో రెడీమేడ్ స్టోర్ లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతైంది. షెడ్డు సహా దుకాణంలోని రెడీ మేడ్ దుస్తులు కాలిపోయాయి. వీటి విలువ లక్షల్లో ఉంటుందని బాధితులు వెల్లడించారు.
తప్పిన పెనుప్రమాదం
11.30గంటల ప్రాంతంలో దుకాణం తూర్పు వైపు రేకుల కింద కప్పి ఉన్న జనప నార సంచులు, కప్పిన వస్ర్తానికి చిన్న మంటలు కనిపించాయి. ఇది చూసిన కొందరు దుకాణం నిర్వాహకులకు చెప్పడంతో బయటకు వచ్చి మంటలను చూసి ఆర్పడానికి యత్నించే లోపే క్షణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన పలువురు లోపల ఉన్న సేల్స్ మ్యాన్, కొనుగోలు దారులను బయటకు పంపించివేశారు. వెను వెంటనే.. లోపలున్న రెడీ మేడ్ దుస్తులకు మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి.
ఇన్ స్పెక్టర్ శేఖర్, పోలీసులు, డిప్యూటి ఎంపిడిఓ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో నీళ్ల ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపు చేయడానికి యత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిశ్చేషుడైన నిర్వాహకులు శ్రీనివాసులు కన్నీటి పర్యంతమై దుకాణం ఎదురుగా నిలబడిపోయారు. ఘటనపై నిర్వాహకులు శ్రీనివాసులను పలుకరించగా.. అప్పులు చేసిన దుకాణం నిర్వహిస్తున్నానని వాపోయారు. రూ.20 లక్షలు వెచ్చించి వేరుశనగ మిల్లు స్థాయిలో ఉండే భారీ స్థాయి షెడ్డు నిర్మించానని చెప్పారు. రూ.30 లక్షల విలువైన రెడీ మేడ్ దుస్తులు ఉన్నాయని శ్రీనివాసులు తెలిపారు. రెండు రోజుల క్రితం తమిళనాడు నుంచి నూతన బట్టల పార్శిళ్ళు వచ్చాయని, వీటిని ఇంకా తెరవ లేదని, ఇవన్నీ కాలిపోయి బూడిదయ్యాయని శ్రీనివాసులు కంటతడితో వివరించారు.