- డీసీసీబీ బ్యాంకులో లోన్ తీసుకున్న రైతు
- వాయిదాలు చెల్లించడం లేదని నోటీసులు
- స్పందించలేదని రెండు గొర్రెల జప్తు
- జీపులో తీసుకెళ్లిన బ్యాంకు అధికారులు
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో డీసీసీబీ బ్యాంకులో తీసుకున్న అప్పు వాయిదాలు సరిగా చెల్లించడం లేదంటూ ఓ రైతుకు చెందిన గొర్రెలను బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. కూసుమంచి మండలం గోరీలపాడు తండాకు చెందిన బదావత్ లింగానాయక్ మండల కేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్లో రూ.50వేలు ముద్రా లోన్ తీసుకున్నారు. ఆ మొత్తానికి కొన్ని నెలలుగా వాయిదాలు చెల్లించడం లేదు.
దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటికీ స్పందన లేకపోవడంతో సోమవారం ఆయన ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ స్రవంతి, సిబ్బంది అప్పు చెల్లించాలని కోరారు. లింగానాయక్ స్పందించకపోవడంతో ఇంట్లో ఉన్న రెండు గొర్రెలను జప్తు చేసి జీపులో బ్యాంకుకు తీసుకెళ్లారు. దీంతో బ్యాంకుకు వచ్చిన లింగానాయక్ రూ.10 వేలు చెల్లించి, మిగతా నగదు వాయిదాల్లో చెల్లిస్తానని తెలిపారు. ఈక్రమంలో బ్యాంకు మేనేజర్ ఆయన గొర్రెలను ఆటోలో తండాకు పంపించారు.