Revanth Reddy | తెలంగాణ రైజింగ్! 2047 టార్గెట్‌తో ముందుకు

రాష్ట్ర అభివృద్ధిలో కీలక లక్ష్యాలు
3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ సాధించ‌డం
ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో దూకుడు
సినీ, టూరిజం రంగాల్లో భారీ పెట్టుబ‌డుల‌కు చాన్స్‌
ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రంలో హైద‌రాబాద్‌
3వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణం
ఇక్క‌డే ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ నిర్మాణం
న్యూయార్క్, లండన్, టోక్యోను త‌ల‌దన్నేలా ఏర్పాట్లు
మాన‌వ వ‌న‌రులు, నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా తెలంగాణ‌
సీఎం రేవంత్ మ‌దిలో రూపుదిద్దుకున్న స‌రికొత్త అంశాలివే..

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి పది శాతం అందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మధ్యకాలిక లక్ష్యంగా 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఓ రూట్ మ్యాప్‌ ఏర్పాటు చేసుకుంది.

ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్..

తెలంగాణకు గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ సిటీని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా, AI-రెడీ డేటా సెంటర్లకు, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాలకు గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ధేశించుకుంది. ఇందుకోసం అవసరమైన రీతిలో హైదరాబాద్ సిటీలో మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పించాలని భావిస్తోంది. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం చేయాలని తీర్మానించుకుంది.

3వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీ..

మూడు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో AI సిటీ, స్పోర్ట్స్ సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ వంటివి భాగంగా ఉంటాయి. ఇది ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, టోక్యో నగరాలతో పోటీపడేలా, కాలుష్యరహిత, కార్బన్-జీరో నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టుల తరహాలో మూసీ నదిని పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

మెరుగైన క‌నెక్టివిటీ కోసం..

రవాణా అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ -2 కు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 201 కిలోమీటర్ల దక్షిణ రీజినల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించి హైదరాబాద్‌పై ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయడం కూడా ఇందులో భాగమే. ఆర్ఆర్ఆర్ లోపల చిన్నపాటి నూతన నగరాల నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ సర్కార్ ఈ విజన్‌లో భాగంగా లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించవచ్చని, తద్వారా తెలంగాణను 3 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

మానవ వనరుల, నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా..

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో మరో కీలక లక్ష్యం మానవ వనరుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం. యువతకు ప్రపంచ నైపుణ్యాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లుగా తీర్చిదిద్దడం, ఐటీఐలలో విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్యను అందించడం విజన్ 2047 లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. ఇందులోనే మహిళా సాధికారిత సాధించడం మరో లక్ష్యం. స్వయం సహాయక బృందాల్లోని 66 లక్షల మంది మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని, ఈ లక్ష్యాన్ని 2028లోగా అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సీఎం రేవంత్‌ను ప్ర‌శంసిస్తూ బ్రిటన్‌ మాజీ ప్రధాని లేఖ

‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’పై బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో ఆయనతో రేవంత్‌రెడ్డి సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047లో నిర్దేశించుకున్న మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ, పెట్టుబడుల సాధన, రైతులు, మహిళలు, యువత సాధికారత, మౌలిక వసతుల కల్పన, ఐటీ, ఇతర రంగాల అభివృద్ధి లక్ష్యాలను, వాటిని చేరుకునే మార్గాలను టోనీ బ్లెయిర్‌కు రేవంత్ వివ‌రించారు. తర్వాత తెలంగాణ రైజింగ్‌ విజన్‌ రూపకల్పన, అమలుకు సంబంధించి ‘టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఛేంజ్‌(టీబీఐజీసీ)’తో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో.. ‘‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. లక్ష్యాల సాధనకు ఇండియాలోని టీబీఐజీసీ ప్రతినిధి.. తెలంగాణ ప్రభుత్వానికి అన్నివేళలా సహకరిస్తారు. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంటూ టోనీబ్లెయిర్‌ పేర్కొన్నారు.

Leave a Reply