గోదావరిఖని (ఆంధ్రప్రభ) : రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, సుమారుగా 200 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి), అదేవిధంగా నగరంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని జనగామ గ్రామంలో సింగరేణి సంస్థకు చెందిన రూ.15 లక్షల నిధులతో నిర్మాణం చేసిన ధోబి ఘాటును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సింగరేణి జిఎం డి లలిత్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి సంస్థ నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దబోతున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని, ప్రజలు కోరుకునే అభివృద్ధిని తాను మొదలు పెడతానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనకు తెలియజేయాలని ఈ సందర్భంగా జనగామ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సూచించారు. ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామస్తుల అవసరాల కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు, సౌచాలయం, రెస్ట్ సెంటర్, బోర్వెల్ నిర్మాణం పనులు కూడా పూర్తి దశకు చేరుకోబోతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : జిఎం లలిత్ కుమార్
ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, అక్కడ ప్రజల సంక్షేమానికి సింగరేణి పరిశ్రమ పూర్తిగా కట్టుబడి ఉందని రామగుండం ఏరియా జిఎం డి లలిత్ కుమార్ అన్నారు. బొగ్గు పరిశ్రమకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా సహకరిస్తున్న అందరికీ జీఎం ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేపిస్తామని లలిత్ కుమార్ చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గోదావరిఖనిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, అవకాశాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే శిక్షణ పొందిన వందల మందికి కార్పొరేట్ స్థాయి సంస్థల్లో ఉపాధి లభించిందని లలిత్ కుమార్ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గ్రామాలకు, కాలనీవాసులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని జిఎం లలిత్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు గోపాల్ సింగ్, కిరణ్ బాబు, వీరారెడ్డి, హనుమంతరావు, నాయకులు జనగామ నారాయణ, మహంకాళి స్వామి, పలాస శ్రీనివాసరావు, పెండ్యాల మహేష్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.