ఖాట్మాండూ – నేపాల్ లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే కోరుతూ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు.. ఈ సందర్భంగా తాజాగా అక్కడ పలు ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు,దాడులు చోటు చేసుకున్నాయి.
ఈ నేపధ్యంలోనే నేపాల్ రాజధాని ఖాట్మాండూ లోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రెచ్చిపోయారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఓ టెలివిజన్ ఆఫీసును, పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు, వాహనాలకు నిప్పంటించారు, దుకాణాలను దోచుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో సైన్యం రంగప్రవేశం చేసి నిరసనకారులను అడ్డుకుంది. ఈ ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 112 మంది గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 100 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు.
కాగా, నేపాల్లో రాచరికం 2008లో అంతమైంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీరాజు జ్ఞానేంద్ర తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఇటీవల వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుంది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం ఈ ఆందోళనలను అణచివేసేందుకు అక్కడి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తున్నది..