వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 27న సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మొదట పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగుతుండగానే పోలీసులు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకోనున్నారు.
వరంగల్ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు పెద్ది మదుసూధన్ రెడ్డి, వినయ్ భాస్కర్ అనుమతి పత్రాలను అందుకున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.
1,213 ఎకరాలు.. 10 లక్షల మంది
గులాబీ పార్టీ పాతికేళ్ల సంబరానికి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1213 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టారు.ఇప్పటికే చింతలపల్లి రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోగా.. ఆ భూములన్నీ చదును చేసి, సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సభలో గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఇప్పటినుంచే ఆసక్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ పెనుమార్పులు తీసుకొస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, రజతోత్సవ మహా సభ గులాబీ పార్టీకి ఏమేరకు సత్ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి