Pakistan | కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్!
- ఆర్మీ చీఫ్ కు అపరిమిత అధికారాలు
- రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదం
- ఆర్మీ కనుసన్నల్లో పాలన
- ఇక ప్రజాప్రతినిధులు నామమాత్రమే
Pakistan | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : యుద్ధ సమయంలో కాళ్ళు పట్టుకుంటున్న పాకిస్తాన్(Pakistan) మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఒక వైపు ఆర్మీ చీఫ్కు అపరిమిత అధికారాలను కట్టబెట్టేందుకు రాజ్యాంగ సవరణకు అక్కడ పార్లమెంట్ ఆమోదించింది. ఈ క్రమంలోనే యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు అపరిమిత అధికారాలను కట్టబెట్టిన బిల్లు ఆమోదం పొందిన వెంటనే రక్షణ శాఖ మంత్రి యుద్ధానికి సిద్ధమని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే పాకిస్తాన్లో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
ఆకలి కేకలతో పాకిస్తాన్ ఘోషిస్తోంది. అక్కడి పాలకులు మాత్రం యుద్ధకాంక్షతో కయ్యాలకు కాలు దువ్వుతూ, పాలన గాలికొదిలేసింది. పాకిస్తాన్ ఆర్మీ వక్రబుద్ధితో పాలకులు తోకాడిస్తున్నారు. ఆర్మీ చీఫ్(Army Chief)కు లభించే అపరిమిత అధికారాలతో పాక్ లోని ప్రజాప్రతినిధులు నామమాత్రంగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం నుంచే ఆర్మీ చెప్పుచేతల్లోకి పాలకులు వెళ్లిపోయారని చెప్పవచ్చు.
27వ రాజ్యాంగ సవరణతో…
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్(Asim Munir)కు అపరిమిత అధికారాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన అధికారాలు విస్తరించేందుకు అవసరమయ్యే 27వ రాజ్యాంగ సవరణకు పాకిస్తాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. దీనికి పార్లమెంటు దిగువ సభ మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదం లభించింది.
కేవలం నలుగురు శాసన సభ్యులు(Legislators) మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎగువ సభలో రెండు రోజుల క్రితమే బిల్లుకు ఆమోదం లభించింది. పాకిస్తాన్ రాష్ట్రపతి సంతకం అనంతరం ఇది చట్టంగా మారనుంది.
ఆర్మీ చీఫ్కు రానున్న అధికారాలు…
ఆర్మీచీఫ్ గా ఉన్న ఆసిం మునీర్ హోదా మారుతుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోర్సెస్ గా హోదా మారనుంది. దీంతో ఆయనకు జీవితకాల రక్షణ లభించనుంది. రాజ్యాంగ పరమైన కేసులను నిర్వహించడానికి కొత్త ఫెడరల్ కాన్సిట్యూషనల్ కోర్టు ఏర్పాటు కానుంది. ఈ కోర్టు న్యాయ మూర్తులను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పాక్ సుప్రీం కోర్టు పాత్ర తగ్గనుంది.
ఆర్మీ కనుసన్నల్లో పాలన
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ మునీర్ ఇక నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోర్సెస్(Chief of Defense Forces)గా హోదా లభిస్తుంది. ఈ అధికారాలతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన ఆసిమ మునీర్ పరిధిలో ఎయిర్ ఫోర్స్, నేవీ(Air Force, Navy)తో పాటు రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇక నుంచి మునీర్ ఆదేశాలు తూచ తప్పకుండా పాటించారు.
ఎన్నో విశేష అధికారాలను కట్టబెట్టడంతో ఇక నుంచి పాకిస్తాన్ పాలన అంతా ఆయన కన్నుసన్నల్లోనే జరుగనుంది. పాక్ లో ప్రజాస్వామ్యానికి విలువ లేదు. అలాగే ప్రజాప్రతినిధుల పాత్ర కూడా నామమాత్రమే.. మునీర్ ఆదేశాల మేరకే పాలన జరుగుతుంది.
సంచలనం రేపిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defense Minister Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు. తూర్పు సరిహద్దులోని భారత్, పశ్చిమ సరిహద్దులో తాలిబన్లతో రెండు వైపులా యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అది ఎవ్వర్నీ ఆశ్చర్యానికి గురిచేయలేదు సరికదా…హాస్యాస్పదమై, మీంస్ నెట్(Means Net)లో హల్ చల్ చేసాయి.

