తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు…

తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు…

అనధికార మిల్లర్లకు ధాన్యం పంపితే కఠిన చర్యలు.

పెద్దపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రబీ ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధారించామని, ఏప్రిల్ లో కొనుగోలు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే 24 గంటల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

కొన్ని కొనుగోలు కేంద్రాలు కేటాయించని మిల్లర్లకు ధాన్యం పంపిస్తున్నట్లు గమనించామని, యాసంగి సీజన్‌లో ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల నేపథ్యంలో ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్ఫాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మేరకు హమాలీ కార్మికులను అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ ధాన్యాన్ని ముందుగా ఎత్తివేయాలని, ఎటువంటి వివక్ష లేకుండా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు.

రామగిరి గ్రామ సభలో చిన్న రైతుల ధాన్యం ముందుగా కొనుగోలు చేయలేదని వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటలలోపు కేటాయించిన మిల్లులకు తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని సంచుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌ల ద్వారా 24 గంటల్లో 100 శాతం ఆన్‌లైన్ నమోదు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply