Sensex | నష్టాలతో స్టాక్ మార్కెట్లు…

Sensex | నష్టాలతో స్టాక్ మార్కెట్లు…

Sensex | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు క్షీణించి 81,909.63 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 25,157.5 వద్ద ముగిసింది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం… నిఫ్టీకి 25,130 కీలక మద్దతు స్థాయి అని, ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే 24,920–24,900 స్థాయిల వరకు పడిపోయే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ఇవాళ ఉదయం.. సెన్సెక్స్(Sensex) 1,000 పాయింట్లు(సుమారు 1 శాతం మేర) పడిపోయి.. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 81,124.45ని తాకింది. నిఫ్టీ సుమారు 250 పాయింట్లు క్షీణించి.. 25,000 స్థాయిని సమీపించింది. ఇది ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 24,919.80ని తాకింది. అయితే, ఇది ట్రెండ్ రివర్సల్ కాదని, మార్కెట్లలో కన్సాలిడేషన్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ కెమికల్ ఇండెక్స్ 2.12 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.66 శాతం, నిఫ్టీ బ్యాంక్(Nifty Bank) 1.02 శాతం చొప్పున నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ వంటి హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

మరోవైపు, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ పతనం నుంచి కొంత కోలుకున్నాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా బలహీనపడింది. యూరప్, గ్రీన్‌లాండ్‌ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్ చర్యలపై ఆందోళనలతో రూపాయి 0.70 శాతం తగ్గి 91.60 వద్ద ట్రేడ్ అయింది.

Leave a Reply