TG | రేవంత్ తో మందకృష్ణ మాదిగ భేటి
- వర్గీకరణపై ఇరువురు చర్చ
- జస్టీస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికపై అభ్యంతరాలు
- ఆ లోపాలు సవరించాలని మంద సూచన
- అధికారులతో చర్చిస్తామన్న రేవంత్
- వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం చేస్తామంటూ భరోసా..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో భాగంగా విద్య, ఉద్యోగాల్లో 3 గ్రూపులుగా వర్గీకరించబడిన ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై ఈ సందర్భంగా చర్చించారు. నివేదికపై మంద కృష్ణ తన అభ్యంతరాలను రేవంత్ రెడ్డికి వివరించారు.
ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నామని.. అయితే జస్టీస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలు, మరికొన్ని ఉపకులాల హక్కులు, వాటా, అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మందకృష్ణ తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ముందు పలు సూచనలు, ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
మందకృష్ణ మాదిగ వెలిబుచ్చిన అభిప్రాయాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. వర్గీకరణ వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలు దళిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు.