Machilipatnam | మహనీయుడు..

Machilipatnam | మహనీయుడు..
Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణిక్యుడు అయిన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం మచిలీపట్నం నగర కార్పోరేషన్ మెయిన్ రోడ్డు మున్సిపల్ ప్రధాన పార్కు ప్రక్కన గల ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి విగ్రహ కమిటీ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ మాట్లాడుతూ.. స్వర్గీయ పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. విదేశాల్లో తాకట్టు పెట్టిన మన దేశ బంగారాన్ని తిరిగి తీసుకువచ్చి దేశ ఆర్థిక పరిపుష్టికి పునాదులు వేసిన మహనీయుడు మన ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు అన్నారు.
ప్రముఖ వైద్యులు బృందావనం ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో మైనార్టీ ప్రభుత్వాన్ని తన మేధస్సుతో ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి దేశ ఆర్థిక పరిస్థితికి మెరుగులు దిద్దిన మహనీయుడు అన్నారు.

బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి, పివి.ఫణి కుమార్ మాట్లాడుతూ.. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన సొంత భూమి 1100 ఎకరాలు దేశంలోని పేద ప్రజలకు పంపిణీ చేసిన మహనీయుడు అన్నారు. క్రమశిక్షణతో ముందుకు సాగిన స్వర్గీయ పీవీ నరసింహారావు పరిపాలన దక్షతను నేటి రాజకీయ నాయకులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు.
వేణుగోపాలస్వామి దేవస్థానం చైర్మన్, బిజెపి సీనియర్ నాయకుడు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ శిఖరాగ్ర మహాసభల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆనాడే బట్టబయలు చేసిన ఘనత స్వర్గీయ పీవీ నరసింహారావుదే అన్నారు.
కాశ్మీర్ సమస్య పై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వాజ్ పేయిను యు ఎన్ ఓ కు పంపించారు. తన సొంత పార్టీ వారిని కాకుండా ప్రతిపక్ష పార్టీ వారిని పంపించి కాశ్మీరు సమస్య పై అనుభవం ఉన్న వాజ్ పేయి ద్వారా పాకిస్తాన్ వాదాన్ని ఎండకట్టే విధంగా ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవించిన ఘనుడు స్వర్గీయ పీవీ నరసింహారావు అన్నారు.

ప్రధాని పీవీ నరసింహారావు జీవిత విశేషాలు భావితరాలకు తెలిసేలా చేయవలసిన బాధ్యత మనందరి పై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, సూరిశెట్టి హరికృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బొడ్డు నాగరాజు, ప్రముఖ న్యాయవాది, పుప్పాల ప్రసాద్, బ్రాహ్మణ సంఘం నాయకులు, ఎం. సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ శ్రీధర్, వి ఎస్ ఎస్ ఆర్ శర్మ, భావ తరంగణి ఎడిటర్, భవిష్య, ఆర్ వి ఎస్ మురళీధర్, లక్క వజ్జుల రామకృష్ణ, తంగిరాల మిధున వ్యాస్,
గొర్తి శర్మ, కొండా ప్రసాద్ తదితరులతో పాటు విగ్రహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
