- సెమీస్ లో న్యూజిలాండ్ ఘన విజయం !
- ఫైనల్స్ లో భారత్ తో ఢీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈరోజు లాహోర్లో జరిగిన సెమీస్లో దక్షిణాఫ్రికా జట్టుకు షాకిచ్చిన కివీస్…50 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక మార్చి 9న (ఆదివారం) జరగనున్న తుది పోరులో కివీస్ జట్టు టీమిండియాతో ఢీ కొననుంది.
కాగా, నేటి మ్యాచ్ లో కివీస్ నిర్దేశించిన 363 పరుగుల భారీ ఛేదనలో… దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (56), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (69) అర్ధ సెంచరీలతో విజృంభించారు. ఇక ఆఖర్లో మోత మోగించిన డేవిడ్ మిల్లర్ (100) సెంచరీ సాధించాడు. అయితే మిగిలిన వారు అంతగా రాణించకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.
న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు తీశాడు. మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మైకేల్ బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించి. ఛాంపియన్స్ ట్రోఫీ లోనే రికార్డు స్కోర్ నమోదు చేసింది. కివీస్ టాపార్డర్ బ్యాటర్లలో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర – కేన్ విలియమ్సన్ సఫారీలపై శతకాలతో గర్జించారు. సెంచరీలతో చెలరేగిన రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ 108) – కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ 102) రెండో వికెట్ కు 154 బంతుల్లో 164 పరుగుల జోడించారు.
రచిన్ – విలియమ్సన్ ఔటైన తరువాత ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ 49), గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ 49 నాటౌట్) ధానాధన్ బౌండరీలతో విరుచుకుపడి.. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు.
దక్షినాఫ్రికా బౌలర్లలో లుంగీ నిగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ రెండు, వియాన్ మల్డర్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.