జుక్కల్, మే 8(ఆంధ్రప్రభ) : జుక్కల్ మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో భవాని క్లాత్ స్టోర్ షాపు దగ్ధమైంది. తెల్లవారుజామున ఆ దుకాణం నుండి పొగలు రావడంతో కొందరు వాహనదారులు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు, వస్త్ర దుకాణం యజమాని ఉప్లాంచే శంకర్ కు తెలియజేశారు. ఈలోగా షాప్ షెటర్ల నుండి మంటలు ఎగసిపడటంతో స్థానికులు బట్టల షాప్ షెటర్లను తొలగించారు.
మద్నూర్ మండల కేంద్రంలో గల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. మద్నూర్ నుండి అగ్నిమాపక వాహనం వచ్చే లోపే దాదాపు లక్షల రూపాయల విలువ చేసే విలువైన బట్టలు, 25వేల రూపాయల నగదులతో పాటు లక్షలాది రూపాయలు వెచ్చించి తయారు చేయించిన ఫర్నీచర్ మొత్తం దగ్ధమైంది. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఆర్పేశారు. పెండ్లి సీజన్ కావడంతో లక్షల విలువైన స్టాక్ తెప్పించటం జరిగిందని, ఆ స్టాక్ ఘట్టాలు కూడా విప్పకముందే షార్ట్ సర్క్యూట్ తో దుకాణం కాలిపోయి భారీ నష్టం వాటిల్లడంతో తాము రోడ్డున పడ్డామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఉప్లాంచే శంకర్ వేడుకుంటున్నారు.