JEE Main 2025 Results | జేఈఈ తొలి మెయిన్ ఫలితాలు విడుదల
న్యూ ఢిల్లీ – జేఈఈ (మెయిన్) ఫలితాలు వచ్చేశాయి. సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో నేడు ఫలితాలను విడుదల చేశారు. ఎస్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 9లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.