న్యూ ఢిల్లీ – ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ గడువు 2025 జులై 31తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.
ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ను జారీ చేయడంలో కొంత జాప్యం జరగడం ఈ గడువు పొడిగింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. “2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను సిద్ధం చేయడానికి కొంత సమయం అవసరం. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిటర్నులు ఫైల్ చేసేందుకు వీలుగా, జులై 31తో ముగియనున్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నాం” అని ఆ ప్రకటనలో ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.