➣ ఐపీఎల్లో కొత్త శకం..
➣ నయా కెప్టెన్లతో తొలి మ్యాచ్
➣ ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్
➣ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
ఐపీఎల్ 2025 కి సమరశంఖం ఈడెన్ గార్డెన్స్ వేదికగా మోగనుంది. రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసే ఈ మెగా టోర్నీ రేపు (శనివారం) అట్టహాసంగా ప్రారంభం కానుంది.
ఇక తొలి మ్యాచ్ లీగ్లోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన జట్ల మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
🔹 కొత్త కెప్టెన్లు..
ఈ సీజన్లో విజయం లక్ష్యంగా కోల్కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. సీనియర్ బ్యాటర్ రహానే కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, యువ ఆటగాడు రజత్ పాటిదార్ ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
దీంతో తొలి మ్యాచ్ లోనే కొత్త నాయకుల సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తలపడనుండడంతో… ఓపెనింగ్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత మరింత ఎక్కువగా ఉంది.
🔹 కోల్కతాదే ఆధిపత్యం!
ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ కి బలమైన కోట. కేకేఆర్ కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా జట్టు 90 మ్యాచ్లలో 52 మ్యాచ్లు గెలిచింది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్లో ఆర్సీబీకి ఆడిన 13 మ్యాచ్లలో 5 మాత్రమే గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్ కు అనుకూలంగా ఉంటుంది. కానీ స్పిన్ బౌలర్లు చాలా సార్లు విజయవంతమయ్యారు.
🔹 పిచ్ రిపోర్ట్..
స్టేడియం పిచ్ పై ఉండే ఫ్లాట్ సర్ఫేస్, పర్ఫెక్ట్ బౌన్స్.. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది, పిచ్ స్లోగా మారి స్పిన్నర్లకు ఉపయోగకరంగా మారుతుంది. ఈ పిచ్ పై 93 ఐపీఎల్ మ్యాచులు జరగగా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు, ఛేజింగ్ జట్టు 55 సార్లు విజయం సాధించింది.
🔹 ప్రారంభోత్సవంలో బాలీవుడ్ తారలు
ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని మరింత గ్రాండ్గా మార్చేందుకు బాలీవుడ్ ప్రముఖులు దిశా పటాని, గాయని శ్రేయా ఘోషల్ వంటి కళాకారులను ఆహ్వానించారు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకకు వాతావరణం ఆటంకం కలిగిస్తుందా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
🔹 లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..
ఇకపోతే, ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లు దిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, ధర్మశాల, గువాహటి, విశాఖపట్టణం నగరాల్లో జరగనున్నాయి. ఐపీఎల్ 2025 మ్యాచ్లు JioHotstar వెబ్సైట్, యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి… అలాగే, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, నెట్వర్క్ 18 టీవీ ఛానెల్లలో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి.
కాగా, ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.12.5 కోట్లు, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు.